రూ.10 లక్షల లంచం డిమాండ్.. సీఐ, ఎస్ఐ అరెస్టు
– బెయిల్ ఇప్పించేందుకు లంచం అడిగినట్లు ఆరోపణలు
– రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్ఐను పట్టుకున్న ఏసీబీ
సైబరాబాద్ – విశాల భారతి
బెయిల్ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసిన కేసులో కీసర సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేంద్రరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్లు తెలిసింది. ఓ కేసులో నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు సీఐ రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఆ మొత్తాన్ని ఎస్ఐ జ్ఞానేంద్రరెడ్డి ద్వారా తీసుకోవాలని సీఐ సూచించినట్లు ఏసీబీ విచారణలో తేలినట్లు సమాచారం.దీంతో ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అధికారులు పక్కా ప్రణాళికతో నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి కీసర చెరువుకట్ట వద్ద వినాయక నిమజ్జన విధుల్లో ఉన్న ఎస్ఐ జ్ఞానేంద్రరెడ్డి రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం అర్ధరాత్రి కీసర పోలీస్స్టేషన్ పరిధిలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు సీఐ అంజనేయులు, ఎస్ఐ జ్ఞానేంద్రరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది.
