గోపనపల్లిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
గోపనపల్లిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం
– అంజయ్యనగర్ ఘటన మరువకముందే మరో కలకలం
– అక్రమ నిర్మాణాలపై చర్యలకు స్థానికుల డిమాండ్
సైబరాబాద్ – విశాల భారతి
కొండాపూర్ అంజయ్యనగర్లో భవనం కూలిన ఘటన మరువకముందే గోపనపల్లిలో మరో నిర్మాణం ప్రమాదకరంగా ఒకవైపునకు ఒరిగింది. ఎన్టీఆర్ నగర్లో కేవలం 30 నుంచి 40 గజాల స్థలంలో నిర్మించిన నాలుగంతస్తుల భవనం ఒరిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఇరుకైన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
భవనం మరింతగా ఒరిగితే పక్కనే ఉన్న ఇళ్లకు, ప్రజలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలపై అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఘటనపై సీఎంసీ అధికారులు పరిశీలించి, నిర్మాణ అనుమతులు, నిబంధనల అమలును పరిశీలించనున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా ముందే ప్రమాదకర నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
