ప్లాట్లలో అక్రమ ప్రవేశం.. సినీ నిర్మాతపై కళ్యాణ్ పై ఫిర్యాదు
– సున్నం చెరువు ప్రాంతంలో స్థలాల ఆక్రమణకు యత్నించారంటూ యజమానుల ఆరోపణలు
సైబరాబాద్ – విశాల భారతి
సున్నం చెరువు ప్రాంతంలోని తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారంటూ సినీ నిర్మాత సి.కళ్యాణ్తో పాటు మరికొందరిపై ప్లాట్ యజమానులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సియాట్ సొసైటీ అధ్యక్షుడు శ్యామ్సింగ్ ఆధ్వర్యంలో యజమానులు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.గుట్టల బేగంపేట పరిధిలోని సర్వే నంబర్లు 12, 12ఏ, 13లో తమకు ప్లాట్లు ఉన్నాయని యజమానులు పేర్కొన్నారు. శనివారం ఉదయం సి.కళ్యాణ్, ప్రకాష్ ధారక్, ప్రేమలత తదితరులు తమ ప్లాట్లలోకి అక్రమంగా ప్రవేశించి బ్లూ షీట్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. తమ స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలోనూ తమ ప్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొంతకాలంగా తమ జోలికి రాలేదని తెలిపారు. తాజాగా మళ్లీ ఆక్రమణకు ప్రయత్నం జరుగుతోందని, దీనిపై సమగ్రంగా విచారించి తమ స్థలాలకు రక్షణ కల్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
