రాజీవ్ ఆశయాల సాధనకు పునరంకితం కావాలి
– ఖైత్లాపూర్లో ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు
కూకట్పల్లి – విశాల భారతి
మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఖైత్లాపూర్ డివిజన్ శ్రీహరినగర్ కాలనీలో బుధవారం రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కలికోట శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీనియర్ నాయకుడు ఎండీ మొయిజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలికోట శంకర్ మాట్లాడుతూ దేశంలో సాంకేతిక, డిజిటల్ రంగాల అభివృద్ధికి రాజీవ్ గాంధీ పునాది వేశారని అన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచారని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో అధికార వికేంద్రీకరణకు కృషి చేశారని గుర్తుచేశారు. రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
