A place where you need to follow for what happening in world cup

- Advertisement -

కొమ్మలు కొట్టుడేనా.. తొలగించరా?

0 50

కొమ్మలు కొట్టుడేనా.. తొలగించరా?
– మాతృశ్రీనగర్‌లో విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం
– నడిరోడ్డుపై చెట్ల వ్యర్థాలు

శేరిలింగంపల్లి – విశాల భారతి
లైన్లు క్లియర్ చేశారు సరే.. మరి రోడ్లను క్లియర్ చేసేది ఎవరు? విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశం మంచిదే కావచ్చు.. కానీ ఆ నెపంతో ప్రజలకు నరకం చూపించడం ఏ రకమైన సేవో విద్యుత్ శాఖ అధికారులకే తెలియాలి. మాతృశ్రీనగర్ నివాసితులు ఇప్పుడు ఇదే నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అధికారులు చూపిస్తున్న ఉదాసీనత, సిబ్బంది నిర్లక్ష్యం స్థానికుల ప్రాణాల మీదకు తెస్తోంది. విద్యుత్ తీగలకు తగులుతున్నాయని చెట్ల కొమ్మలను నరకడం వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతి బాధ్యతను గాలికి వదిలేయడం అధికారుల రాక్షస ఆనందానికి అద్దం పడుతోంది.
​మాతృశ్రీనగర్ డివిజన్ పరిధిలోని అసోసియేషన్ కార్యాలయం సమీపంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. భారీ చెట్ల కొమ్మలను నరికివేసి, వాటిని తొలగించకుండా నడిరోడ్డుపైనే వదిలేసి చేతులు దులుపుకున్నారు. పంక్చువాలిటీకి పెద్దపీట వేస్తామని చెప్పే శాఖ, పనిచేసి వెళ్లిపోవడంలో చూపించిన శ్రద్ధ.. ఆ వ్యర్థాలను తరలించడంలో ఏమాత్రం చూపించకపోవడం గమనార్హం. రోడ్డు సగానికి పైగా ఈ కొమ్మల కుప్పలే ఆక్రమించడంతో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు భయపడిపోతున్నారు.
​ఓ వైపు నగరంలో ఇప్పటికే రోడ్ల తవ్వకాలు, గుంతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే, విద్యుత్ సిబ్బంది తెచ్చిపెట్టిన ఈ కొత్త ముప్పు గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. నరికిన కొమ్మలు, ఆకులు రోడ్డుకు అడ్డంగా పడి ఉండటంతో వాహనదారులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు మధ్యలోకి వచ్చి ప్రయాణించాల్సి వస్తోంది. ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు తప్పుకోవడానికి కూడా కాసింత జాగ లేక నిమిషాల వ్యవధిలోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వారిని దింపడానికి వచ్చే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందోనని భయంతో వణికిపోతున్నారు.
​ఒక సమస్యకు పరిష్కారం చూపుతూనే, అంతకంటే పెద్ద సమస్యను సృష్టించడం విద్యుత్ అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. పని పూర్తయ్యాక పరిసరాలను శుభ్రం చేయాలన్న కనీస ధర్మం, స్పృహ సిబ్బందికి లేకపోవడం శోచనీయం. డివిజన్ స్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు ఎసి గదులకే పరిమితం కావడం వల్లే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోయాక గానీ అధికారుల్లో చలనం రాదా అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు నిద్రమత్తు వదిలి, తక్షణమే స్పందించి ఆ కొమ్మల వ్యర్థాలను రోడ్డుపై నుంచి తొలగించి, రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని మాతృశ్రీనగర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.