ఏఐతో సాంకేతిక పరివర్తనకు పీడీఐ సన్నద్ధం
– హైదరాబాద్లో ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాలతో సీటీఓ రఘు బొంగుల సమావేశం
సైబరాబాద్ – విశాల భారతి
నాలుగు దశాబ్దాలుగా సాంకేతిక రంగంలో సేవలందిస్తున్న పీడీఐ టెక్నాలజీస్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రఘు బొంగుల హైదరాబాద్ కార్యాలయాన్ని సందర్శించారు. సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు జరిగిన పర్యటనలో భాగంగా భారత ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సంస్థలో ఏఐ ఆధారిత సాంకేతిక పరివర్తన, నూతన టెక్నాలజీల స్వీకరణ, ప్రొడక్ట్ ఇన్నోవేషన్, కస్టమర్ కేంద్రిత సేవలపై భవిష్యత్ వ్యూహాలను చర్చించారు. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఏఐను విస్తృతంగా వినియోగించడం ద్వారా ఉత్పాదకత, నాణ్యత, పనుల వేగాన్ని మరింత పెంచుకోవచ్చని రఘు బొంగుల సూచించారు. ఇంజినీరింగ్ బృందాలు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని వినూత్న ఉత్పత్తులు, సేవల అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
భారత్లో పీడీఐ టెక్నాలజీస్ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ సెంటర్ హెడ్ రవి మొచర్ల తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కేంద్రాల్లో సుమారు 600 మంది పనిచేస్తున్నారని, సంస్థకు భారత్ కీలకమైన ప్రతిభా కేంద్రంగా ఎదుగుతోందని వెల్లడించారు.
