అనుమతులు మూడంతస్తులకు.. నిర్మాణం ఏడంతస్తులకు!
– సెట్బ్యాక్ లేకుండానే సెల్లార్తో భవనం.. డీసీకి మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు
శేరిలింగంపల్లి – విశాల భారతి
శేరిలింగంపల్లి సర్కిల్-49 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతూ బిల్డర్లు అమాయక ప్రజలను నష్టాల పాల్జేస్తున్నారని మిద్దెల మల్లారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. శ్రీరామ్నగర్ డివిజన్లోని డీఎల్ఎఫ్ ప్రధాన రహదారిని ఆనుకొని ప్లాట్ నంబర్ 99/బీ పక్కన మూడు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఏడు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సెట్బ్యాక్ కూడా వదలకుండా సెల్లార్తో సహా నిర్మాణం చేపట్టి, భవనాన్ని విక్రయించేందుకు ‘హౌస్ ఫర్ సేల్’ బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ నిర్మాణంపై గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా నిర్మాణదారులు పట్టించుకోకుండా పనులు కొనసాగించారని ఆరోపించారు.అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తే భవనాలను కొనుగోలు చేసిన అమాయక ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డర్లు మాత్రం డబ్బులు తీసుకుని తప్పించుకునే అవకాశం ఉందన్నారు. అందువల్ల ప్రజలు నష్టపోకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.భవనాన్ని వెంటనే సీజ్ చేసి విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వకుండా సంబంధిత శాఖలకు లేఖలు రాయాలని, రిజిస్ట్రేషన్ జరగకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాణదారులు ప్రవీణ్, కాసయ్య, సుధాకర్లకు తక్షణమే నోటీసులు జారీ చేసి, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడేలా అధికారులు స్పందించాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.
