రుణమాఫీ కోసం మరోసారి రైతు పోరుబాట.
* అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదంటూ దళిత యువ రైతు ఆవేదన.
* పది రోజుల దీక్ష.. కలెక్టరేట్కు పాదయాత్ర చేసినా పరిష్కారం లేదని ఆరోపణ.
* బ్యాంకు, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం.
* త్వరలో కలెక్టరేట్ ఎదుట ఒకరోజు దీక్షకు సహదేవ్ సిద్ధం.
మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విశాల భారతి):
ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ పథకం తనకు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత యువ రైతు సహదేవ్ మరోసారి పోరుబాట పట్టారు. తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే పది రోజుల పాటు దీక్ష చేపట్టడంతో పాటు కలెక్టరేట్కు పాదయాత్ర చేసి అధికారులకు వినతిపత్రం అందజేసినా న్యాయం జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీకి తాను అర్హుడినని సహదేవ్ తెలిపారు. అయినప్పటికీ తన రుణం మాఫీ కాకపోవడానికి బ్యాంకు, వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అర్హత ఉన్న రైతుకు ప్రభుత్వ పథకం అందకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
★పది రోజుల దీక్ష.. కలెక్టరేట్కు పాదయాత్ర.
రుణమాఫీ కోసం తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గతంలో పది రోజుల పాటు దీక్ష చేపట్టినట్లు సహదేవ్ తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. సమస్యను పరిశీలించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని ఆరోపించారు.
★అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం.
రుణమాఫీ కోసం బ్యాంకు కార్యాలయం నుంచి వ్యవసాయశాఖ కార్యాలయం వరకు పలుమార్లు తిరిగినట్లు సహదేవ్ తెలిపారు. ఒక్కో కార్యాలయంలో ఒక్కో సమాధానం చెప్పడంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయారు. సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తన చెప్పులు అరిగిపోయే పరిస్థితి వచ్చినా ఫలితం మాత్రం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
★మళ్లీ ఆందోళనకు సిద్ధం.
గతంలో చేపట్టిన నిరసనలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నట్లు సహదేవ్ వెల్లడించారు. త్వరలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తానని చెప్పారు.
★అంబేద్కర్కు వినతిపత్రం.
రైతు రుణమాఫీపై ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం కురవి మండల కేంద్రంలోని డా. బి.ఆర్. అంబేద్కర్కు వినతిపత్రం సమర్పించారు. అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో అధికారులు స్పష్టంగా తెలియజేయాలని, సంబంధిత బ్యాంకు, వ్యవసాయశాఖ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. “అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ ప్రయోజనం అందాలి. రైతు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు సమస్యలను పరిష్కరించాలి. తనకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తా” అని సహదేవ్ స్పష్టం చేశారు.
