మియాపూర్–అల్విన్ మార్గంలో 180 రోజుల ట్రాఫిక్ ఆంక్షలు
– ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు
– ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని ట్రాఫిక్ పోలీసుల సూచన
సైబరాబాద్ – విశాల భారతి
ఓల్డ్ ముంబై హైవే ఎన్హెచ్-65పై మియాపూర్ ఎక్స్రోడ్డు నుంచి అల్విన్ ఎక్స్రోడ్డు వరకు చేపట్టనున్న అభివృద్ధి పనులతో 180 రోజులపాటు ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ ఆలస్యం ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఆగస్టు 14, 2026 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.మియాపూర్ ఎక్స్రోడ్డు–అల్విన్ ఎక్స్రోడ్డు మధ్య ఆరు లేన్ల ద్విముఖ ఫ్లైఓవర్, అల్విన్ ఎక్స్రోడ్డు–హఫీజ్పేట్ మధ్య మూడు లేన్ల ఏకముఖ అండర్పాస్, బాచుపల్లి–మియాపూర్ ఎక్స్రోడ్డు మధ్య మూడు లేన్ల రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా పీక్ అవర్స్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని పోలీసులు సూచించారు.వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
