తాగి నడిపితే కటకటాలే
– వీకెండ్ డ్రైవ్లో 190 మంది పట్టుబడ్డారు
– సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
సైబరాబాద్ – విశాల భారతి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 190 మంది పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని, అలాంటి వారి వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత 105 సెక్షన్ కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సెక్షన్ ప్రకారం దోషులకు పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
గత వారం రోజుల్లో కోర్టులో మొత్తం 376 డ్రంక్ డ్రైవ్ కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. వాటిలో పది మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష, నలుగురికి జరిమానాతో పాటు సామాజిక సేవ, మిగతా 362 మందికి జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రజలు బాధ్యతగా వ్యవహరించి తాగి వాహనాలు నడపవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
