ఇంటి దొంగల అరెస్ట్ – పనిమనిషి, చెల్లి కలిసి బంగారం, నగదు చోరీ – 100 గ్రాముల బంగారం బిస్కెట్ స్వాధీనం
ఇంటి దొంగల అరెస్ట్
– పనిమనిషి, చెల్లి కలిసి బంగారం, నగదు చోరీ
– 100 గ్రాముల బంగారం బిస్కెట్ స్వాధీనం
సైబరాబాద్ – విశాల భారతి
కేపీహెచ్బీ కాలనీ ఇందూ ఫార్చూన్ ఫీల్డ్స్ 7వ ఫేజ్లోని ఓ విల్లాలో పనిమనిషి, ఆమె చెల్లి కలిసి 24 క్యారెట్ల 100 గ్రాముల బంగారం బిస్కెట్, రూ.లక్ష నగదు చోరీ చేశారు. నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..ఉద్దగిరి టాటారావు నివాసంలో పనిమనుషులుగా పనిచేస్తున్న కొనాల రమ్య (36), ఆమె చెల్లి కర్రి నాగలక్ష్మి (34) గత మే 19న ఉదయం ఇంటి యజమాని భార్య నాగ ఉదయ భాస్కరం రెండో అంతస్తులోని బీరువా తెరిచి మూయడం మరచిపోవడాన్ని గమనించారు. బీరువాలో ఉన్న బంగారం బిస్కెట్, రూ.500 నోట్ల రెండు కట్టలు మొత్తం రూ.లక్ష నగదును అపహరించారు.నగదును చెరో రూ.50 వేలు పంచుకుని విలాసాలకు, అప్పులు తీర్చేందుకు ఖర్చు చేశారు. బంగారం బిస్కెట్ను తమ గదిలో దాచిపెట్టారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే పోలీసులు ఈ నెల 30న ఉదయం 6 గంటలకు వారి గదిలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 100 గ్రాముల బంగారం బిస్కెట్ను స్వాధీనం చేసుకున్నారు.నిందితులు ఇద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలానికి చెందిన వారు. ప్రస్తుతం ఇందూ ఫార్చూన్ ఫీల్డ్స్లో నివాసం ఉంటున్నారు.కుకట్పల్లి డీసీపీ రితిరాజ్, కేపీహెచ్బీ ఏసీపీ ఈ. రవికిరణ్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్హెచ్ఓ ఎస్. రాజశేఖర్ రెడ్డి, డీఐ కె.ఎస్. రవి, డీఎస్ఐ అబ్దుల్ సమద్, క్రైమ్ టీమ్ కేసును ఛేదించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు అందజేయనున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
