ఎల్లమ్మబండలో పారిశుద్ధ్య పనుల తనిఖీ.. అధికారులకు జోనల్ కమిషనర్ ఆదేశాలు
– శంషీగూడ వార్డు 245లో ఆకస్మిక పర్యటన
– చెత్త రహిత కాలనీలే లక్ష్యంగా పనిచేయాలి
కుకట్పల్లి,విశాల భారతి
క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనుల తీరును తెలుసుకునేందుకు కుకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్సింగ్ సోమవారం ఉదయం శంషీగూడ వార్డు-245 పరిధిలోని ఎల్లమ్మబండ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆల్విన్ కాలనీ సర్కిల్-51 ఉప కమిషనర్ చాముండేశ్వరి, డీఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏలతో కలిసి ఆయన ఎల్లమ్మబండ మెయిన్ రోడ్డుతో పాటు అంతర్గత వీధుల్లో కలియతిరిగి పారిశుద్ధ్య పనులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఉప కమిషనర్ చాముండేశ్వరి, మహిళా ఎస్ఆర్పీ అధికారులు ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలు, డోర్-టు-డోర్ చెత్త సేకరణ, స్వచ్ఛ ఆటోల పనితీరును జోనల్ కమిషనర్ మయాంక్సింగ్కు వివరించారు. రోడ్లపై చెత్త కుప్పలు లేకుండా చూడటంతో పాటు బ్లాక్ స్పాట్స్ను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతాలను సుందరీకరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి తప్పనిసరిగా సేకరించాలని, ఇందుకోసం ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి రోడ్డుపై చెత్త వేస్తే కఠినంగా జరిమానాలు విధించాలని స్పష్టం చేశారు. స్వచ్ఛ ఆటోలు ప్రతి వీధికి వెళ్లేలా చూడటంతో పాటు వాటి కదలికలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.’స్వచ్ఛ కుకట్పల్లి’ లక్ష్యం నెరవేరాలంటే కేవలం అధికారులు, సిబ్బందే కాకుండా ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరని, కాలనీ సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని జోనల్ కమిషనర్ మయాంక్సింగ్ పేర్కొన్నారు. ఎల్లమ్మబండ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా ఉన్నాయని, ఇదే స్ఫూర్తిని జోన్ పరిధిలోని అన్ని వార్డుల్లో కొనసాగించాలని ఆయన అధికారులను కోరారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
