స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పనులు ప్రారంభం
– ఓటర్ల వివరాల నమోదుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన
కుకట్పల్లి,విశాల భారతి
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ ) కార్యక్రమం సోమవారం ఆల్విన్ కాలనీ సర్కిల్ పరిధిలోని సమతా నగర్, శ్రీరామ్ నగర్, తులసి నగర్ కాలనీల్లో ప్రారంభమైంది. బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లు, స్థానిక నాయకులు ఆయా కాలనీల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా కొత్తగా ఓటు నమోదు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియను కూడా వివరించారు. లబ్ధిదారులకు ఎస్ఐఆర్ ఫారాలను అందజేసి, వాటిని పూర్తి చేసే విధానాన్ని వివరించారు. ఓటరు జాబితా పూర్తి స్వచ్ఛత, పారదర్శకతతో ఉండేందుకు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని సూచించారు. ప్రజలు సహకరిస్తేనే దొంగ ఓట్లు లేని, పక్కా ఓటరు జాబితా రూపొందుతుందని వివరించారు. సమతా నగర్, శ్రీరామ్ నగర్, తులసి నగర్లోని ప్రతి ఇంటినీ సందర్శించి ఫారం-6, 7, 8లను అందజేస్తామని, పూర్తి చేసిన దరఖాస్తులను వెంటనే సేకరిస్తామని బీఎల్ఓలు పేర్కొన్నారు. కాలనీవాసులు సైతం సర్వేకు సహకరించి తమ వివరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు లత , సురేష్, తుడుం యేలేంద్ర, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
