Vishalabharathi: పాలకుర్తి మండలంలోని ప్రసిద్ధ ప్రాచీన దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి దిశగా కీలక చర్యలు చేపడుతున్నట్లు స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి తెలిపారు. గురువారం నాడు ఆలయాన్ని అధికారులతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే, ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, అధికారులు, దేవస్థాన EO విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి రోజున భక్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఆలయాన్ని మరోసారి సందర్శించాను. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీకి తగిన సదుపాయాలతో ఉండేలా ఆధునికీకరణ చర్యలు చేపడతాం. సోమేశ్వర ఆలయాన్ని భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దడమే నా ప్రధాన లక్ష్యం అని అన్నారు. వారి ఆదేశాల మేరకు అధికారులు ఆలయ ప్రాంగణంలో 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేపట్టారు. అదేవిధంగా అఖండ జ్యోతి కొత్త నిర్మాణం, అఖండ జ్యోతికి వెళ్లే మార్గంలో మెట్లు ఏర్పాటు, అలాగే పంచగూళ్ల ఆలయం దగ్గర నుండి గుట్టపైకి ఘాట్ రోడ్ నిర్మాణం, కిచెన్ షెడ్ పెండింగ్ పనులను పూర్తి చేయడం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. సోమేశ్వర ఆలయం పాలకుర్తి ప్రజల విశ్వాసానికి ప్రతీక. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వ స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ ప్రత్యేకంగా దీపోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అని వెల్లడించారు. ఆలయ పునరుద్ధరణ పనుల్లో భాగంగా పార్కింగ్ స్థలాలు, భక్తుల విశ్రాంతి కేంద్రాలు, త్రాగునీటి సదుపాయాలు, సౌకర్యవంతమైన మార్గాలు, విద్యుత్ వ్యవస్థలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని వారు అధికారులను ఆదేశించారు.
