చెవులకందిన శబ్దం.. కళ్లలో ఆనంద బాష్పాలు
– వృద్ధురాలికి బాసటగా వడ్డేపల్లి
– నేనున్నాను’ అంటూ భరోసానిచ్చిన బీజేపీ సీనియర్ నాయకుడు రాజేశ్వరరావు
కూకట్పల్లి – విశాల భారతి
వయోభారంతో పాటు వినికిడి లోపంతో సతమతమవుతున్న ఒక నిస్సహాయ వృద్ధురాలి జీవితంలో వెలుగులు నింపేందుకు ప్రముఖ రాజకీయ నాయకుడు, బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముందుకు వచ్చిన సంఘటన స్థానికంగా తీవ్ర భావోద్వేగాన్ని నింపింది. రాజేశ్వరరావు కనబరిచిన ఉదారత, మానవతా దృక్పథం పట్ల స్థానిక ప్రజల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
కూకట్పల్లి వెంకటేశ్వర నగర్ ప్రాంతానికి చెందిన సుమారు 80 ఏళ్ల వయసున్న విరమ్మ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా రెండు చెవులూ వినిపించక తీవ్ర అవస్థలు పడుతోంది. ధ్వని ప్రపంచానికి దూరమై శోకసంద్రంలో మునిగిపోయిన ఆమె, తన కుమార్తెతో కలిసి వడ్డేపల్లి రాజేశ్వరరావును కలిసి తన అవేదనను వ్యక్తం చేసుకుంది. ఆమె పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి చలించిపోయిన ఆయన, క్షణం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించారు.
ఆమెను సొంత కుటుంబసభ్యురాలిగా భావించి మనోధైర్యాన్ని నూరిపోసిన రాజేశ్వరరావు, వెంటనే సంబంధిత ఈఎన్టీ వైద్య నిపుణుల వద్దకు తీసుకెళ్లారు. అవసరమైన వైద్య పరీక్షలన్నీ దగ్గరుండి చేయించి, ఆమె వినికిడి లోపానికి తగిన ఆధునిక డిజిటల్ వినికిడి పరికరాన్ని సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందజేశారు. పరికరాన్ని అమర్చిన వెంటనే మళ్లీ మాటలు, శబ్దాలు స్పష్టంగా వినిపించడంతో ఆ వృద్ధురాలు తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకుంది. తనకు మళ్లీ కొత్త జీవితాన్ని, వినికిడి శక్తిని ప్రసాదించిన రాజేశ్వరరావుకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపింది.ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు, పేదలకు సహాయపడటంలోనే నిజమైన తృప్తి ఉందన్నారు. వృద్ధాప్యంలో ఎవరూ లేక ఇబ్బందిపడే వారికి సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. విరమ్మకు భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ‘నేనున్నాను’ అంటూ కొండంత అభయాన్నిచ్చారు. ఒక నాయకుడిలా కాకుండా ఆపద్బాంధవుడిలా నిలబడి వృద్ధురాలికి బాసటగా నిలిచిన రాజేశ్వరరావు సేవా దృక్పథాన్ని, విశాల హృదయాన్ని వెంకటేశ్వర నగర్ నివాసులు కొనియాడారు.
