రోడ్డు ప్రమాదంలో సేల్స్ గర్ల్ దుర్మరణం
– గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో విషాదం
సైబరాబాద్ – విశాల భారతి
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మల్లం భవాని (23) అనే యువతి గచ్చిబౌలిలోని ఒక హాస్టల్లో నివసిస్తూ సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె అంజయ్యనగర్లోని హాస్టల్లో ఉంటున్న తన స్నేహితురాలు సుభాషిని (30)తో కలిసి యాక్టివా ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ ఐటీ (ట్రిపుల్ ఐటీ) వైపు నుంచి అంజయ్యనగర్ వైపు బయలుదేరారు.వారి వాహనం గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపానికి చేరుకోగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ వీరి యాక్టివాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు భవాని కిందపడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ఉన్న సుభాషినికి సైతం తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన సుభాషినిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భవాని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకరి నిర్లక్ష్యం కారణంగా యువతి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
