మసీదుబండలో ఎస్ఐఆర్ పనుల పరిశీలన
– నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
మసీదుబండ ప్రాంతంలో సాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ మహిపాల్రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిటీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ, వాటి ధ్రువీకరణ ప్రక్రియను ఆయన నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం పనుల పురోగతిపై అక్కడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.బాధితుల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కేంద్రానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిర్దేశిత గడువులోగా ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో భాగంగా సిబ్బంది దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులను, వివరాలను డిప్యూటీ కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
