మత్తులో స్టీరింగ్ పడితే పదేళ్ల జైలు
– సైబరాబాద్లో 354 మందిపై వేటు
సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ లో వీకెండ్ మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్లపైకి వచ్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. శని, ఆదివారాల్లో కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వందలాది మంది దొరికిపోయారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 354 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరినందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ అదనపు డీసీపీ జి. హనుమంతరావు వెల్లడించారు.ఈ తనిఖీల్లో పట్టుబడిన వారిలో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. మొత్తం బాధితుల్లో 299 మంది టూవీలర్లపై వెళ్తుండగా, 38 మంది కార్లు, 17 మంది ఆటోలు నడుపుతూ దొరికారు. ఈసారి భారీ వాహనాల డ్రైవర్లు ఎవరూ పట్టుబడకపోవడం గమనార్హం. వీరి రక్త నమూనాలను పరీక్షించగా అత్యధికులు ప్రమాదకర స్థాయిలోనే మద్యం సేవించినట్లు తేలింది. 305 మందిలో 36 నుంచి 200 మిల్లీగ్రాముల ఆల్కహాల్ నమోదు కాగా, 31 మందిలో 201 నుంచి 300 మిల్లీగ్రాములు, మరో 18 మందిలో అత్యంత ప్రమాదకరంగా 301 నుంచి 550 మిల్లీగ్రాముల మేర ఆల్కహాల్ ఉన్నట్లు రీడింగ్స్ చూపించాయి.మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే ఇకపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 105 కింద హత్యకాని నరహత్య కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరం రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత వారం కోర్టు ముందుకు వచ్చిన 258 కేసుల్లో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఒకరికి సామాజిక సేవతో పాటు జరిమానా విధించగా, మిగిలిన 249 మందికి కోర్టు జరిమానా విధించింది. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదాల నివారణకు సహకరించాలని అధికారులు కోరారు.
