తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు
– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు
ఇబ్రహీంపట్నం – విశాల భారతి
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి నివాసంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఉదయం సోదాలు చేపట్టారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.శ్రీనివాస్రెడ్డికి సంబంధించిన ఇబ్రహీంపట్నంలోని నివాసంతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, నగదు, బంగారం తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.గతంలో మహేశ్వరం మండలంలో ఎమ్మార్వోగా పనిచేసిన శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆదాయానికి అనుగుణంగా కాకుండా అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.సోదాల్లో లభించే ఆస్తులు, పత్రాలు, ఇతర వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. తనిఖీలు పూర్తయిన అనంతరం స్వాధీనం చేసుకున్న పత్రాలు, గుర్తించిన ఆస్తుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
