భద్రాద్రి ప్రతినిథి: విశాలభారతి: మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ పీకే ఓసీ–2లో శనివారం రెండో షిఫ్ట్ “బి’ రిలే లంచ్ టైంలో ప్రమాదం చోటుచేసుకుంది. సాయంత్రం సుమారు 7.45 నుంచి 8.00 గంటల మధ్య పాత వి–పాయింట్ సమీపంలో రెండు డంపర్లు ఒకదానికొకటి ఢీకొన్నట్లు సమాచారం. ఆల్ రోడ్లపై సరైన విధంగా వాటర్ స్ప్రే చేయకపోవడంతో తీవ్రమైన దుమ్ము ఏర్పడి ముందున్న డంపర్ కనిపించక ఈ ప్రమాదం జరిగిందని తోటి డంపర్ ఆపరేటర్ వెల్లడించాడు.ఈ అంశాన్ని ఇప్పటికే స్ట్రక్చర్ మీటింగ్స్లో, యూనియన్ నాయకులు, ప్రెస్ రిపోర్టర్లు పలుమార్లు జీఎం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు ‘దున్నపోతుపై వాన పడినట్లే’ ఉందని విమర్శిస్తున్నారు.ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల భద్రత, ప్రాణాలపై లేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మికులకు కనీస రక్షణ కూడా లేకుండా పని చేయాల్సి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత అధికారుల దృష్టికి మళ్లీ తీసుకెళ్లడంతో పాటు అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని కార్మిక సంఘ నేతలు, సామాజిక సేవకులు తెలిపారు.
