విశాలభారతి, అబ్దుల్లాపూర్ మెట్ : హయత్నగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రైమరీ పాఠశాల, ఉర్దూ పాఠశాల, అలాగే ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్వహించిన గౌరవ వందనాన్ని కార్పొరేటర్ స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రైమరీ పాఠశాలలో విద్యాభ్యాసం, క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన పర్వదినమని తెలిపారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి విద్యార్థి తెలుసుకుని క్రమశిక్షణతో కూడిన మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతిభలో ఏమాత్రం తగ్గకుండా ఉన్నారని ఈ వేడుకల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరా, ప్రైమరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీన్ దయాల్ రెడ్డి, ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు ఫాతిమా, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
