డయల్-100 ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
– ప్రమాద బాధితుడికి స్పందించకపోవడంపై సీపీ డా. ఎం. రమేష్ చర్య
సైబరాబాద్,విశాల భారతి
అత్యవసర సేవ అయిన డయల్-100కు వచ్చిన ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన రాయదుర్గం పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ (హెచ్సీ-661)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ సస్పెండ్ చేశారు.ఆగస్టు 1 అర్ధరాత్రి గచ్చిబౌలి ఐకియా సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటన అనంతరం బాధితుడు రెండు సార్లు డయల్-100కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరినట్లు అధికారులు తెలిపారు. అయితే విధుల్లో ఇన్చార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ యూనస్ సంఘటనా స్థలానికి వెళ్లకుండా, “కాలర్ వల్ల ఇబ్బంది” అనే కారణంతో రెండు ఫిర్యాదులను ఎలాంటి చర్యలు తీసుకోకుండా మూసివేసినట్లు విచారణలో వెల్లడైంది.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు సయ్యద్ యూనస్ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజలకు అత్యవసర సేవల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
