కూరగాయల మార్కెట్లో బీజేపీ వినూత్న ఆందోళన
– ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదలకు డిమాండ్
కూకట్పల్లి -విశాల భారతి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలోని భరత్నగర్ కూరగాయల మార్కెట్లో మంగళవారం వినూత్న నిరసన నిర్వహించారు. “ఫీజు బకాయి–బీజేపీ లడాయి” కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజేశ్వరరావు కూరగాయలు విక్రయించడం, కూరగాయల బస్తాలు మోయడం, మార్కెట్లో రోడ్లు ఊడవడం ద్వారా ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వ్యాపారులు, కార్మికులు, స్థానిక ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి ఫీజు బకాయిల సమస్యను వివరించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వానికి నిధుల కొరత ఉంటే తాము మార్కెట్లో కూరగాయలు అమ్మి, బస్తాలు మోసి, రోడ్లు ఊడ్చి వచ్చిన డబ్బును ప్రభుత్వానికి అందిస్తామని, కానీ పేద విద్యార్థుల భవిష్యత్తుతో మాత్రం చెలగాటం ఆడొద్దని అన్నారు. వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ వ్యాపారులు, కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విద్యార్థులకు మద్దతు ప్రకటించారు.
