హైడ్రా పర్మిషన్లు ఇక ఆన్లైన్లోనే.. ఫైర్ ఎన్ఓసీ, రెన్యూవల్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్
సైబరాబాద్ – విశాల భారతి
నగరంలో నాన్ హైరైజ్ భవనాల యజమానులకు హైడ్రా సంస్థ తీపి కబురు అందించింది. అగ్నిమాపక నిరాక్షేపణ పత్రం (ఎన్ఓసీ) జారీ, దాని పునరుద్ధరణ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోకి మార్చింది. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా పనులు ముగించుకునేలా సరికొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన రుసుము చెల్లించడం, చివరగా ఆమోదం పొందిన ధృవీకరణ పత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలన్నీ ఒకే వేదికపై లభిస్తాయి. ప్రస్తుతం ఈ ఆన్లైన్ సేవలను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోని నాన్ హైరైజ్ భవనాలకు వర్తింపజేశారు.
ఈ కొత్త విధానం వల్ల దరఖాస్తు ప్రక్రియలో పారదర్శకత పెరగడంతో పాటు ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తుదారులు నేరుగా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లాలో అధికారులు ఈ ఆన్లైన్ సేవల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
