కార్యకర్తలకు అండగా ఉంటా
– రూ.25 వేల ఆర్థిక సాయం అందజేత
– ధైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులకు భరోసా
– చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శ
శేరిలింగంపల్లి – విశాల భారతి
లింగంపల్లి ఫ్లైఓవర్పై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ చారిని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పరామర్శించారు. ప్రస్తుతం అశోక్నగర్లోని శ్రీ వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చారిని ఆయన శుక్రవారం పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.ఈ ప్రమాదంలో విష్ణువర్ధన్ చారి కుడి కంటి పైభాగంలో తీవ్ర గాయమై 13 కుట్లు పడినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం చికిత్స ఖర్చుల నిమిత్తం రూ. 25 వేల ఆర్థిక సహాయాన్నిఅందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ కోసం కష్టపడే నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. విష్ణువర్ధన్ చారి త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.
