పోలీస్ గేమ్స్లో సైబరాబాద్ జయభేరి
– 37 పతకాలతో క్లస్టర్–ఏ జట్టు ఘనత
– విజేతలను సత్కరించిన సీపీ డా. ఎం. రమేష్
సైబరాబాద్ – విశాల భారతి
రాష్ట్రస్థాయి 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్–2026లో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ క్లస్టర్–ఏ జట్టు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టింది. సరూర్నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక క్రీడా పోటీల్లో సైబరాబాద్ క్రీడాకారులు రికార్డు స్థాయిలో మొత్తం 37 పతకాలను కైవసం చేసుకుని కమిషనరేట్ కీర్తిపతాకాన్ని ఎగురవేశారు. తీవ్రమైన పోటీ నడుమ సాగిన ఈ క్రీడల్లో క్లస్టర్-ఏ జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి 9 స్వర్ణ, 8 రజత, 20 కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రీడా బరిలో సైబరాబాద్ అథ్లెట్లు బహుముఖ ప్రతిభను చాటారు. ముఖ్యంగా యోగా, ఆర్మ్ రెజ్లింగ్, వుషు, తైక్వాండో, బాక్సింగ్, కరాటే, జిమ్నాస్టిక్స్, పెన్చక్ సిలాట్, పవర్లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ వంటి తదితర విభిన్న క్రీడా విభాగాల్లో అద్భుతంగా రాణించి పతకాల పంట పండించారు. విధుల నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించి వారు సాధించిన ఈ విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.పోలీస్ గేమ్స్లో అత్యుత్తమ ప్రదర్శనతో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ శుక్రవారం కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విజేతలను శాలువాలతో సత్కరించి, నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటూ, కఠినమైన విధులను నిర్వహిస్తూనే.. క్రమం తప్పకుండా సాధన చేసి ఈ స్థాయి విజయాలు సాధించడం నిజంగా అభినందనీయమని సీపీ కొనియాడారు. ఇదే క్రీడా స్ఫూర్తిని మున్ముందు కూడా కొనసాగించి, జాతీయ స్థాయిలోనూ సైబరాబాద్ పోలీసుల సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో క్రీడాకారులకు కమిషనరేట్ తరఫున అవసరమైన అన్ని రకాల వసతులు, అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ సత్కార కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్, డీసీపీలు టి. అన్నపూర్ణ, సుధీంద్ర, పుష్ప, సంజీవ్లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
