వికారాబాద్,తాండూర్: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై నిరాధార, కుట్ర పూరిత వార్తలు ప్రసారం చేసి,సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం పట్ల తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మా మంత్రులు రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తుంటే ఓర్వలేక అసత్యపు వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నిబద్ధత గల నాయకుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారనీ,5సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా ప్రజల మన్ననలు పొందిన సీనియర్ నేత అన్నారు.తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర ఆయనదన్నారు.ఎవరికి ఏ ఆపద వచ్చి వెళ్లినా సాయం చేసే గుణం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిదనీ,బడుగు బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం తపించే గొప్ప నాయకుడనీ చెప్పారు. అట్లాంటి నాయకుని మీద అసత్యపు వార్తలతో దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని,ఆయన క్యారెక్టర్ పై బురద జల్లాలని చూస్తే సహించే ప్రసక్తే లేదనీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాపై మా ముఖ్యమంత్రి,మంత్రులు మాట్లాడుతుంటే.. వీళ్లకు పాలనపై పట్టు వచ్చింది..ఏదైనా అసత్య ప్రచారం చేయాలనే దురుద్దేశంతోనే ఈ కుట్ర పూరిత వార్తలకు పునుకున్నారన్నారు. ఐఏఎస్,ఐపీఎస్ లపై నిందలు వేయడం మీడియా విలువలకు మంచి పద్ధతి కాదన్నారు. ఇట్లాంటి తప్పుడు వార్తలు మళ్లీ పునరావృతం అయితే అది తెలంగాణ పై దాడిగానే పరిగణించాల్సి ఉంటుందని, ఇకపై ఊర్కోమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
