చందానగర్లో బంగారు దుకాణంలో భారీ చోరీ
– బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపంలోని షాప్ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు
– సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు
సైబరాబాద్ – విశాల భారతి
చందానగర్లోని ఓ బంగారు దుకాణంలో జరిగిన భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ సమీపంలో ఉన్న గోల్డ్ షాప్లోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. శనివారం ఉదయం దుకాణం తెరిచిన యజమాని లోపల వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో పాటు బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అప్రమత్తమైన చందానగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో దుకాణాన్ని క్షుణ్నంగా పరిశీలించారు.దుండగులు ఏ మార్గంలో దుకాణంలోకి ప్రవేశించారు, ఎంత మొత్తంలో బంగారం చోరీకి గురైంది, చోరీకి ఒకరే పాల్పడ్డారా లేక ముఠాగా వచ్చారా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువపై యజమాని నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
