మెటా ఇండియా హెడ్ కేసు వివాదం
– సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై బదిలీ వేటు
– అరుణ్ శ్రీనివాస్ను నిందితుడిగా చేర్చిన కేసుపై విమర్శలు
– డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేసిన అధికారి
సైబరాబాద్ – విశాల భారతి
సోషల్ మీడియా వేదికగా చేసిన వివాదాస్పద పోస్టుల కేసులో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ను నిందితుడిగా చేర్చిన వ్యవహారం రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఈ కేసును నమోదు చేసిన సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.తెలంగాణ బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు ప్రచురించిన వ్యక్తులపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఆ పోస్టులను తొలగించడంలో లేదా నియంత్రించడంలో విఫలమయ్యారనే కారణంతో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్ను కూడా నిందితుడిగా చేర్చడం వివాదాస్పదమైంది.ఈ చర్యపై న్యాయ నిపుణులు, సాంకేతిక రంగ ప్రతినిధులు, పలువురు విశ్లేషకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికను ఉపయోగించిన వ్యక్తుల చర్యలకు సంస్థ ప్రతినిధిని నేరుగా బాధ్యుడిగా పేర్కొనడం చట్టపరంగా సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబును బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆయన డీజీపీ కార్యాలయంలో విధులకు హాజరై రిపోర్ట్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.మెటా ఇండియా హెడ్ను నిందితుడిగా చేర్చిన ఈ కేసు సోషల్ మీడియా వేదికల బాధ్యతలు, చట్టపరమైన పరిమితులు, దర్యాప్తు విధానాలపై కొత్త చర్చకు తెరలేపింది. కేసుకు సంబంధించిన తదుపరి చర్యలు చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాతే చేపడతామని సంబంధిత అధికారులు వెల్లడించారు.
