పాల్వంచ, విశాలభారతి: పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు పాల్వంచ పట్టణం ముస్తాబైంది. ఈ నూతన సంవత్సర వేడుకలను క్యాష్ చేసుకునేందుకు వ్యాపార సముదాయాలు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఫుడ్ లవర్స్ను టార్గెట్ చేస్తూ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్ల వెనుక నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆఫర్ల వెల్లువ.. నోరూరించే బిర్యానీలు, కేకులు!
డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తేదీల్లో వ్యాపారాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు మరియు బేకరీల యజమానులు పోటీ పడుతున్నారు. ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ లేదా ‘ఫ్యామిలీ ప్యాక్’ పై భారీ డిస్కౌంట్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. రంగురంగుల కేకులు, స్వీట్లు మరియు స్నాక్స్ ఐటమ్స్ను విరివిగా మార్కెట్లోకి తెచ్చారు.
నాణ్యతపై నీలినీడలు.. అధికారులు ఏం చేస్తున్నారు?
వేడుకల పేరుతో జరుగుతున్న ఈ భారీ విక్రయాల్లో నాణ్యతా ప్రమాణాలు గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కల్తీ రంగులు…కేకులు, బిర్యానీలలో ఆకర్షణ కోసం మోతాదుకు మించి రంగులు వాడుతున్నట్లు సమాచారం.
నిల్వ ఆహారం నారోగ్యానికి దారి
రద్దీని తట్టుకోవడానికి ఎక్కువ మోతాదులో ముందే తయారు చేసి పెట్టిన చికెన్, మటన్ ముక్కలను వేడి చేసి వడ్డిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి.అంతే కాకుండా కిచెన్లలో గదిలో కనీస శుభ్రత పాటించకపోవడం పట్ల వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిమ్మకు నీరెత్తినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు!
పట్టణంలో ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు కనీసం తనిఖీలు నిర్వహించకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.అధికారుల పర్యవేక్షణ లోపం వ్యాపారులకు వరంగా మారింది. కొంతమంది అధికారుల “మామూళ్ల” మత్తులో జోగుతూ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తనిఖీలు చేయాల్సిన సమయంలో అధికారులు కార్యాలయాలకే పరిమితం కావడం వెనుక అంతర్యమేమిటని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.
వినియోగదారులకు హెచ్చరిక:
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఆహార పదార్థాలు కొనేటప్పుడు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. రంగులు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
