అశ్వాపురం:విశాలభారతి: పాల్వంచ కెఎల్ఆర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఇద్దరు విద్యార్థులకు బలంగా గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. అశ్వాపురం మండలంలోని మొండికుంట, పాలవాగు మధ్యన అటవి ప్రాంతంలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలో బస్సులో సుమారు 50 మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారని సమాచారం. విషయం తెలిసిన వెంటనే మణుగూరు డిఎస్పి వంగా రవీందర్ రెడ్డి, అశ్వాపురం సిఐ జి అశోక్ రెడ్డి అలాగే పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరంచేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులలో ఇద్దరికీ తీవ్ర గాయాలుకాగా ,ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. విద్యార్థులు స్వల్ప గాయాలుతో బయటపడడంతో పెను ప్రమాదంతప్పింది.ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. రోజువారీగా మణుగూరు, అశ్వాపురం తదితర గ్రామాలనుండి విద్యార్ధులను ఎక్కించుకొని పాల్వంచ గల కెఎల్ఆర్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ వస్తూ ఉండగా ఘటన జరిగింది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులతో మాట్లాడి ప్రమాదానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బస్సు ప్రమాదానికి గల కారణాలేంటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
