విశాలభారతి: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల సందడి మొదలైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతితో పాటు, 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 21గా నిర్ణయించారు. అదేవిధంగా ఫిబ్రవరి 22 పరీక్షను నిర్వహించనున్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థి ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం , విద్యార్థి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ https://tgcet.cgg.gov.in ను సందర్శించవచ్చని పేర్కొన్నారు.
