బాలల రక్షణకు పోలీస్ భరోసా
– దర్పణ్’ అస్త్రంతో చిన్నారుల వేట
– ఏడు ప్రత్యేక బృందాలతో జూలై నెలంతా ‘ఆపరేషన్ ముస్కాన్-12’
సైబరాబాద్ – విశాల భారతి
సమాజంలో చిన్నారులకు భద్రత కల్పించే బాధ్యత అందరిదీ. అందుకే వీధి బాలలు, బాలకార్మికులు, భిక్షాటన చేసే పిల్లలను రక్షించేందుకు సైబరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ ముస్కాన్-12’ పేరుతో నెల రోజుల ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం సీపీ కార్యాలయ ఆడిటోరియంలో అన్ని శాఖలతో కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించి పోస్టర్లు విడుదల చేశారు.ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ, జూలై 1 నుంచి 31 వరకు జరిగే ఈ ఆపరేషన్లో ప్రతి బృందంలో ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ సహా ఐదుగురు పోలీసులు ఉంటారన్నారు. మొత్తం ఏడు బృందాలు హాట్స్పాట్లలో తనిఖీలు చేస్తాయని, బాలకార్మిక వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు.పిల్లల ఆచూకీ కోసం టెక్నాలజీని వాడుతున్నాం. తప్పిపోయిన పిల్లల ఫోటోలను ‘దర్పణ్’ యాప్లో అప్లోడ్ చేస్తే దేశవ్యాప్తంగా మ్యాచ్ అవుతుంది’ అని డీసీపీ కె. సృజన వివరించారు. ఈ ఆపరేషన్ను డీసీపీ సృజన పర్యవేక్షిస్తుండగా, ఏహెచ్టీయూ ఇన్స్పెక్టర్ యాదయ్య గౌడ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ కృష్ణప్రసాద్, లేబర్ అధికారి సాహితి, మూడు జిల్లాల డీసీపీఓలు ప్రవీణ్ కుమార్, ఇంతియాజ్, రత్నం, సీడబ్ల్యూసీ సభ్యులు రాజారెడ్డి, వెంకటేశం, వైద్యాధికారి హలీమ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ‘ఆపరేషన్ ముస్కాన్-12’ను విజయవంతం చేస్తామని ప్రతిన బూనారు.
