మాదాపూర్ భూవివాదంలో ఉద్రిక్తత
సైబరాబాద్ – విశాల భారతి
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో భూవివాదం మళ్ళీ ఉద్రిక్తతకు దారితీసింది. ఖానామెట్ సర్వే నంబర్ 11/37లోని భూమి తమదేనంటూ మైఖేల్రెడ్డి వర్గం బుధవారం ఉదయం రేకుల చుట్టూ ఇనుప షీట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. సర్వే పూర్తయ్యాకే ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. అయితే ఈ భూమిపై తమకే హక్కులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్రావు వర్గానికి చెందినవారు అక్కడికి చేరుకుని ఆ పనులను అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకొని వాతావరణం వేడెక్కింది. సమాచారం అందుకున్న మాదాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. భూమికి సంబంధించిన పత్రాలు, ఆధారాలను పరిశీలిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచామని పోలీసులు వెల్లడించారు.
