హైదరాబాద్, విశాలభారతి: తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కోరారు. రాష్ట్రం లోని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులందరూ ఆ మేరకు ప్రభుత్వానికి విన్నవించాలని సూచించారు. సోమవారం హైదరాబాద్ లక్డికాపూల్ వాసవి సేవా కేంద్రంలో జరిగిన ‘వైశ్య కిరణం’ పత్రిక రజతోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వైశ్యకరణం క్యాలెండర్ ను, జాతి ఆణిముత్యాలు – వైశ్య వైభవం పేరుతో వెలువరించిన ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైశ్యులకు సముచిత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వైశ్యులలో ఐకమత్యం పెరగాల్సిన అవసరం ఉందని సూచించారు. వైశ్యుల పేర్ల చివరలో గుప్తా లేదా శెట్టి అని తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు.
ఒక పత్రిక నడపడం అనేక వ్యయప్రయాసలతో కూడుకున్నదని రాష్ట్ర పోలీసు కార్పొరేషన్ పూర్వ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్త అన్నారు. వైశ్య పత్రికలు వాస్తవాలను రాయాలని, సంఘాలలోని అవినీతి అక్రమాలను వెలికి తీయాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ సూచించారు.
రాష్ట్రంలో ఆర్యవైశ్యుల బలాన్ని చాటేలా త్వరలో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి, ఐ వి ఎఫ్ సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలిపారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా బలపడటంపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త సూచించారు. ఆర్థిక బలం కన్నా రాజకీయ బలం ముఖ్యమని బీజేపీ నాయకుడు గందె సుధాకర్ అన్నారు. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఐ వి ఎఫ్ అడ్వైజరీ బోర్డ్ ఛైర్మన్ గంజి రాజమౌళి గుప్త, ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్, వైశ్య వికాస వేదిక వ్యవస్థాపకుడు కాచం సత్యనారాయణ గుప్త తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులను, వివిధ రంగాల ప్రముఖులను సన్మానించారు. ప్రముఖ కవి, రచయిత మాడిశెట్టి గోపాల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
