అశ్వాపురం, విశాలభారతి : అనుమానాస్పద స్థితిలో హైదరాబాదులోని ఎల్బీనగర్ సమీపంలో గల ప్రభుత్వ వసతి గృహంలో నివాసముంటున్న కనుకు సరస్వతి (21) ఈ నెల నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలు ఏడాది నుండి కంప్యూటర్లో కోచింగ్ కు వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. అయితే ఓ రెండు నెలల నుండి ఓ ప్రైవేట్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతురాలుకి అశ్వాపురం గ్రామానికి చెందిన పాలడుగు నందకిషోర్ అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతికి కారణం ఆ యువకుడేనని ఆరోపిస్తూ మంగళవారం మృతురాలి తల్లిదండ్రులతో పాటు బంధువులు అశ్వాపురం మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. సుమారు ఒరగంట పాటు ఆందోళన కొనసాగించారు. ఆందోళన చేస్తున్న వద్దకు అశ్వాపురం ఎస్సై రాజేష్ సిబ్బందితో వచ్చి ఆందోళకారులకు నచ్చజెప్పి విరమింప చేశారు. రోడ్డుపై ఆందోళన విరమించిన మృతురాలి బంధువులతో పాటు కుటుంబీకులు నందకిషోర్ స్వగ్రామమైన అశ్వాపురంలో వారు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటిముందు టెంటు వేసి మృతదేహంతో సహా ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
