జులై 1న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలి
– పేదలకు ఇంటి స్థలాలు, పట్టాలు వెంటనే ఇవ్వాలి సీపీఐ
– ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు పిలుపు
శేరిలింగంపల్లి,విశాల భారతి
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు సొంత ఇంటి స్థలం, ఇంటి పట్టా కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భూమిలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సీపీఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్కు ఎన్నోసార్లు వినతి పత్రాలు, అర్జీలు పెట్టుకున్న పేద ప్రజలు అధికంగా ఉన్నారని తెలిపారు. వారికి వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ పార్టీ ‘చలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్’ కార్యక్రమం నిర్వహిస్తుందని, శేరిలింగంపల్లి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం లేదని, మరోవైపు ప్రభుత్వ భూములు కార్పొరేట్ సంస్థలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్న తీరు తీవ్రంగా ఖండించదగినదని ఆయన అన్నారు. పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు సాధించుకునేందుకు జులై 1న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిలో ఇల్లు లేని ప్రజలు, నిరుపేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజల హక్కుల కోసం జరిగే ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ప్రభుత్వం వెంటనే అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం, ఇంటి పట్టా మంజూరు చేయాలని, ఖాళీ ప్రభుత్వ భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తోందని తెలిపారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉద్ధృతమైన ప్రజా ఉద్యమాలు, భూ పోరాటాలు చేపడతామని టి. రామకృష్ణ హెచ్చరించారు.
