కూకట్ పల్లి కోర్టులో ఘనంగా బోనాల సంబరాలు
– మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు
– కల్వ మైసమ్మకు ప్రత్యేక పూజలు
సైబరాబాద్ – విశాల భారతి
ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కోర్టు ఆవరణలో బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళా న్యాయవాదులు రంగురంగుల పూలతో బోనాలను అందంగా అలంకరించి, భక్తిశ్రద్ధలతో తలపై మోసుకొచ్చారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, భక్తుల జైజైధ్వానాల మధ్య కోర్టు ఆవరణ నుంచి భారీ ఊరేగింపుగా బయలుదేరిన న్యాయవాదులు మల్లికార్జున చెరువు గట్టుపై ఉన్న కల్వ మైసమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించారు.అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతం కావాలని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణ భక్తి పారవశ్యంతో కళకళలాడగా, బోనాల శోభను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమంలో కూకట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. సురేందర్, ఉపాధ్యక్షులు బి. సత్యనారాయణ, కె. శ్రీదేవి, లేడీ సెక్రటరీ సి.హెచ్. ప్రత్యూష రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి వేడుకలు పరస్పర ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
