ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై కారు బీభత్సం
– ఇద్దరు యువకులు మృతి
– బ్రిడ్జి పిల్లర్ను ఢీకొన్న తవేరా
– అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఇద్దరు
సైబరాబాద్ – విశాల భారతి
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీసు రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అతివేగంగా వెళ్తున్న తవేరా కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.పోలీసుల వివరాల ప్రకారం.. కొల్లూరు ఇంద్రారెడ్డినగర్కు చెందిన కనైయాల్ (25), దేరామ్ (24) టైల్స్ పనులు చేస్తూ జీవిస్తున్నారు. వీరి స్వస్థలం రాజస్థాన్. శనివారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో ఇద్దరూ ఇంద్రారెడ్డినగర్ నుంచి నానక్రామ్గూడలోని సత్వాకు ఏపీ 01 ఏబీ 2232 నంబరు గల తవేరా కారులో బయలుదేరారు. కారును కనైయాల్ నడుపుతున్నాడు.డంపింగ్యార్డు, నియో పోలీస్ బ్రిడ్జి సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై కారు అతివేగంగా వెళ్తుండగా అదుపుతప్పింది. దీంతో కారు నేరుగా బ్రిడ్జి పిల్లర్ను ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్న కనైయాల్, దేరామ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది స్వయం ప్రమాదమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
