కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం!
– బౌరంపేట్లో విషాద ఘటన.. కుటుంబ కలహాలే కారణమా?
సైబరాబాద్ – విశాల భారతి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట్లో ఓ వ్యక్తి కారులో కూర్చొని నిప్పంటించుకోవడంతో మృతి చెందాడు. రాధాకృష్ణ (40)గా పోలీసులు గుర్తించారు.స్థానికుల సమాచారం ప్రకారం.. రాధాకృష్ణ కారులో ఉండగానే మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా కారంతా వ్యాపించడంతో ఆయన బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. కారు పూర్తిగా దగ్ధమైన అనంతరం స్థానికులు ఘటనను గమనించి అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే రాధాకృష్ణ మృతి చెందినట్లు గుర్తించారు.ఘటనపై దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే రాధాకృష్ణ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
