జగద్గిరిగుట్టలో పాన్ బ్రోకర్ మోసం
– రూ.23 లక్షల నగదు, 1.3 కిలోల బంగారం మాయం
– 37 మంది బాధితులు.. షాపునకు తాళం వేసి నిర్వాహకుడు పరార్
సైబరాబాద్ – విశాల భారతి
తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇవ్వకుండా షాపునకు తాళం వేసి నిర్వాహకుడు పరారైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, చంద్రగిరి నగర్కు చెందిన మినాగ నిర్మల్ కుమార్ స్థానికంగా ఉన్న ‘శుభం పాన్ బ్రోకర్స్ అండ్ జ్యువెలర్స్’ నిర్వాహకుడు రమేష్ వద్ద రూ.8.80 లక్షల రుణం కోసం 207 గ్రాముల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టాడు. ఆయనతో పాటు మరో 36 మంది కూడా తమ అవసరాల కోసం అదే షాపులో వివిధ పరిమాణాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఇలా మొత్తం 37 మంది బాధితులు కలిపి సుమారు 1.3 కిలోల ఆభరణాలను తాకట్టు పెట్టి దాదాపు రూ.23 లక్షల వరకు రుణాలు పొందారు.బాధితుల్లో పలువురు తాము తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీ డబ్బులను తిరిగి చెల్లించినప్పటికీ నిర్వాహకుడు రమేష్ వారి బంగారాన్ని వెనక్కి ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు. అనుమానం వచ్చిన బాధితులు షాపు వద్దకు వెళ్లగా తాళం వేసి ఉంది. అలాగే నిర్వాహకుడికి సంబంధించిన ఫోన్ నంబర్లు కూడా స్విచ్ఆఫ్ రావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. నార్మల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆభరణాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన రశీదులు, ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న రమేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
