పరికీ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
– డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంయుక్త తనిఖీలు
సైబరాబాద్ – విశాల భారతి
ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ సర్కిల్ 51 పరిధిలోని పరికీ చెరువు వద్ద ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నట్లు సర్కిల్ ఉప కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. శనివారం పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, ఇతర శాఖల ప్రతినిధులతో కలిసి ఆమె చెరువు ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ దీపాలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చాముండేశ్వరితో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), పోలీసు శాఖ అధికారులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, రాంకీ ప్రతినిధులు, సీఎంసీ పారిశుధ్య విభాగానికి చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
