బోండాలో బొద్దింక.. హోటల్ పరిశుభ్రతపై ఫిర్యాదు
– వినియోగదారుడి ఆందోళన.. తనిఖీలు చేపట్టాలని స్థానికుల డిమాండ్
రాజేంద్రనగర్ – విశాల భారతి
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడలో ఓ హోటల్లో వడ్డించిన బోండాలో బొద్దింక కనిపించిందంటూ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో ఆహార భద్రత అంశం మరోసారి చర్చనీయాంశమైంది.బండ్లగూడకు చెందిన మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం న్యూ ఉడిపి కృష్ణ హోటల్కు టిఫిన్కు వెళ్లాడు. అక్కడ ఆర్డర్ చేసిన బోండా తింటుండగా అందులో బొద్దింక కనిపించిందని తెలిపాడు. వెంటనే హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన వివరణ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించాడు.అనంతరం హోటల్లోని వంటగది, పరిసరాలను పరిశీలించగా పరిశుభ్రత లోపించినట్లు గుర్తించానని మహేష్ పేర్కొన్నాడు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డాడు.ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని కొన్ని హోటళ్లలో ఆహార భద్రతా నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని, సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుని ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
