ధరణి నగర్లో డీసీ వర్షాకాల ముందస్తు తనిఖీలు
– నాలా, నీటి నిల్వ పాయింట్లు, ఫ్లెక్సీల తొలగింపుపై ఆరా
– అంతర్గత రోడ్లలో స్వీపింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం*
సైబరాబాద్ – విశాల భారతి
వర్షాకాల ప్రణాళికలో భాగంగా శనివారం ఆల్విన్ కాలనీ సర్కిల్-51 డీసీ చాముండేశ్వరి ధరణి నగర్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డీఈ, ఎస్ఆర్పీ, ఎస్ఎఫ్ఏతో కలిసి కాలనీలోని నాలాను పరిశీలించి, నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా తీశారు.నాలాలో అడ్డంకులు తొలగించాలని, సిల్ట్ ఎప్పటికప్పుడు తీసివేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా కాలనీలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న పనులను పర్యవేక్షించారు. అంతర్గత రోడ్లలో స్వీపింగ్ పనులు ముమ్మరంగా చేపట్టాలని, ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు.
.
