బస్టాప్లో చెత్తపై డీసీ ఫైర్
– వెంటనే తొలగించాలని ఎస్ఎఫ్ఏకు ఆదేశం
సైబరాబాద్ – విశాల భారతి
హైదర్నగర్ మెయిన్ రోడ్డులోని బస్ స్టాప్ పరిసరాలు చెత్తతో నిండిపోవడంపై ఆల్విన్ కాలనీ సర్కిల్-51 డీసీ చాముండేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మెట్రో స్టేషన్ సమీపంలోని బస్ స్టాప్ వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆమె, రోడ్డు పక్కన గుట్టలుగా పేరుకుపోయిన గ్రీన్ వేస్ట్ను చూసి అసహనం వ్యక్తం చేశారు.సంబంధిత ఎస్ఎఫ్ఏను వెంటనే పిలిపించి ‘బస్టాప్ అంటే నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే చోటు. ఇక్కడే ఇలా చెత్త పేరుకుపోతే ఎలా? వెంటనే తొలగించండి’ అంటూ మందలించారు. రోజువారీ స్వీపింగ్ తప్పనిసరిగా చేపట్టాలని, ఆకులు, కొమ్మలు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్టాప్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
