సైబరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
237 మందిపై కేసులు
సైబరాబాద్ – విశాల భారతి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 237 మంది పట్టుబడ్డారు. ఇందులో 205 మంది ద్విచక్ర వాహనదారులు, 28 మంది కార్ల డ్రైవర్లు, నలుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారని సైబరాబాద్ ట్రాఫిక్ అడ్మిన్ అదనపు డీసీపీ జి.నరేందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో సిఐ క్రాంతి కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా 219 మంది రక్తంలో మద్యం శాతం 36 ఎంజీ నుంచి 200 ఎంజీ మధ్య ఉన్నట్లు గుర్తించారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు పేర్కొన్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023 సెక్షన్ 105 కింద కేసులు నమోదు చేస్తామని, ఈ నేరానికి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. కాగా, గత వారం రోజుల్లో కోర్టులు 309 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించాయని, ఇందులో ఐదుగురికి జైలు శిక్ష పడగా, మిగిలిన వారికి జరిమానాలు, సామాజిక సేవ విధించినట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
