ఏసీబీ వలలో డీఎస్పీ భీమ్రెడ్డి
– నార్సింగి వెసెల్లా మెడోస్ విల్లాలో కీలక సోదాలు
– 20 చోట్ల ఏసీబీ తనిఖీలు
సైబరాబాద్ – విశాల భారతి
అవినీతి ఆరోపణలతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ టార్గెట్ చేసింది. గురువారం ఉదయం నుంచి ఆయన నివాసాలు, కార్యాలయాలపై మెరుపు దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ సారథ్యంలో 15 బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.గురువారం తెల్లవారుజామున 5 గంటలకే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని వెసెల్లా మెడోస్లో భీమ్రెడ్డి నివాసం ఉంటున్న రూ.8 కోట్ల విలాసవంతమైన విల్లాను తొలుత తనిఖీ చేశారు. భీమ్రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఇంటిని పూర్తిగా జల్లెడ పట్టారు. భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు కట్టలు బయటపడినట్లు ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి.
భీమ్రెడ్డి బ్యాక్గ్రౌండ్..
భీమ్రెడ్డి 2011లో మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా, 2022లో పటాన్చెరు డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత పలు కీలక పోస్టింగ్లలో పనిచేసి ప్రస్తుతం డీఎస్పీగా ఉన్నారు. ఈ కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. పదోన్నతులు, కీలక పోస్టింగ్ల కోసం చేసిన వసూళ్లతోనే ఆస్తులు పోగేశారని ప్రాథమికంగా తేలింది.
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం..
నార్సింగి విల్లాతో పాటు హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని భీమ్రెడ్డి ఇళ్లు, ఫామ్హౌస్లు, కార్యాలయాలు, బంధువుల నివాసాల్లో సోదాలు చేశారు. పలు బ్యాంకుల లాకర్ల తాళాలు, బినామీ పేర్లతో ఉన్న వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగలు, పత్రాలను నేలపై వస్త్రం పరిచి వేరు చేసి, ల్యాప్టాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు.ప్రభుత్వ ఉద్యోగి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే చర్యలు తప్పవు. భీమ్రెడ్డి విషయంలో పక్కా ఆధారాలున్నాయి. బినామీల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలిస్తున్నాం. సోదాలు పూర్తయ్యాక అక్రమాస్తుల మొత్తం విలువను అధికారికంగా ప్రకటిస్తాం” అని రేంజ్-1 ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ మీడియాకు తెలిపారు.
భీమ్రెడ్డిని అదుపులోకి తీసుకుని ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఆస్తులు ఎలా వచ్చాయి, ఎవరి పేర్లతో ఉన్నాయి, వసూళ్ల వెనుక ఎవరున్నారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. ఈ రాకెట్లో మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.
