గచ్చిబౌలి అల్సబా రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ దాడి
– కంపుకొడుతున్న కిచెన్.. వాష్రూమ్ పక్కనే రుమాలి రొట్టెల తయారీ
సైబరాబాద్ – విశాల భారతి
బిర్యానీలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నగరంలోని ప్రముఖ హోటళ్లలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఐటీ కారిడార్లోని గచ్చిబౌలిలో ఉన్న ‘అల్సబా’ రెస్టారెంట్పై ఆహార భద్రతా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, తిండి ప్రియుల ప్రాణాలతో ఆడుకుంటున్న తీరు చూసి అధికారులే షాకయ్యారు.
కార్మికులు వాడే అపరిశుభ్రమైన వాష్రూమ్కు సరిగ్గా పక్కనే ఎలాంటి మూతలు లేకుండా రుమాలి రొట్టెలను తయారు చేస్తుండటం ఇక్కడ కలకలం రేపింది. కిచెన్ లోపల ఈగలు ముసురుతున్న వాతావరణంలో చికెన్ను పడేయడమే కాకుండా, ఫ్రీజర్లో మాంసాన్ని కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టమొచ్చినట్లు కుక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక పాత్రలు కడిగే వాష్ ఏరియాలో నీరంతా నిల్వ ఉండిపోయి కంపు కొడుతోంది. కనీసం హోటల్లో వాడే నీటి నాణ్యత పరీక్షల నివేదికలు గానీ, అక్కడ వంట చేసే మాస్టర్ల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు గానీ యాజమాన్యం దగ్గర లేకపోవడం గమనార్హం. నిబంధనలను నిలువునా పాతరేసిన అల్సబా హోటల్ యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
