‘సర్’దర్ద్!
కాగితాలపైనే 100% క్షేత్రస్థాయిలో అంతంతే
సైబరాబాద్ – విశాల భారతి
హైదర్నగర్ డివిజన్ బూత్ 467లో ‘బిఎల్వో’ల నిర్లక్ష్యం ‘యూట్యూబ్’ చూసి నింపుకోమంటూ ఉచిత సలహాలు కూకట్పల్లి (ఆల్విన్ కాలనీ సర్కిల్-51) రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో గందరగోళంగా మారింది. అధికారులు కాగితాలపై 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని నివేదికలు పంపుతున్నా, వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
ముఖ్యంగా హైదర్నగర్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నంబర్ 467 లో బీఎల్వోల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓటర్లకు ఫారాలు అందకపోగా, ఒకవేళ అందినా వాటిని ఎలా నింపాలో చెప్పే నాథుడే కరువయ్యాడు. ఫారంలోని 2002 నాటి వివరాల కాలమ్లో ఏం రాయాలో తెలియక ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన సిబ్బంది.. “యూట్యూబ్లో వీడియోలు చూసి నింపుకోండి”అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఓటరు పోర్టల్ సర్వర్ సమస్యలు, జాబితాల్లో తప్పుల తడకలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాగితాల అంకెలపై కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరికీ అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
