– తాత్కాలిక పనులు వద్దు.. శాశ్వత పరిష్కారం చూపండి
– తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు రవికుమార్ యాదవ్ డిమాండ్
సైబరాబాద్ – విశాలభారతి: లింగంపల్లి డివిజన్ గచ్చిబౌలి గ్రామం, ఇందిరా నగర్లో గత ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న డ్రైనేజ్, నాలా సమస్యపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏళ్లు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం లేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.ఇటీవల కురిసిన వర్షానికి గచ్చిబౌలి గ్రామం మొత్తం మురుగు నీటిమయమైన నేపథ్యంలో రవికుమార్ యాదవ్ స్థానిక ప్రజలతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. అంజయ్య నగర్ నుంచి వచ్చే నాలాను రాడిసన్ హోటల్ వద్ద గచ్చిబౌలి గ్రామం మీదుగా వెళ్లే నాలో కలపడం వల్ల సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇందిరా నగర్లో నాలా, డ్రైనేజీ సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోందని చెప్పారు. అనేకసార్లు పర్యటించి జీహెచ్ఎంసీ కార్యాలయంలో వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. అంజయ్య నగర్ నాలా పీజేఆర్ నగర్ వైపు వెళ్లాల్సి ఉండగా, అధికారులు గతంలోనే సమస్య ఉన్న గచ్చిబౌలి గ్రామం నాలో కలిపారని ఆరోపించారు. ఉన్న సమస్య తగ్గకపోగా కొత్త సమస్య తెచ్చిపెట్టారని, ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు.ఈ ప్రాంతంలో హాస్టళ్లు, ఇళ్లు పెరిగాయని, దానికి అనుగుణంగా నాలాను విస్తరించి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అన్నారు. తాత్కాలిక మరమ్మతులతో కాలం గడిపే ప్రయత్నం వద్దని, శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులకు సూచించారు. లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ పర్యటనలో బీజేపీ సినీయర్ నాయకులు ఎల్లేష్, ఓబుల్ రెడ్డి, మఖన్ సింగ్, నరసింహ, మహేందర్ యాదవ్, శశాంక్, రోహిత్, జై హింద్, మధు, రాఘవ చారి, రఘునాథ్, సుబ్రమణ్యం, దినేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
